మెంటర్ గా యువీ

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మెంటార్‌ అవతారం ఎత్తాడు. పంజాబ్‌ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు యువరాజ్. లాక్‌డౌన్‌ సమయంలో పీసీఏ జిమ్‌ అందుబాటులో లేకపోవడంతో శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ప్రభుసిమ్రన్‌ సింగ్‌, అన్మోల్‌ ప్రీత్‌సింగ్‌ కసరత్తులు చేసేందుకు తన సొంత జిమ్‌ను అప్పగించాడు. త్వరగా దేహదారుఢ్యం సాధించేదుకు సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా వారికి క్రికెట్‌ పాఠాలు చెప్పాడు.

మానసిక దృఢత్వం గురించి బోధించాడు. చక్కని ఆహారాన్ని అందిస్తూ సొంత తమ్ముళ్లుగా ఆదరించాడు. అందుకే సీజన్‌ పూర్తయ్యే వరకు యువీతో టచ్‌లో ఉంటామని, అవసరమైన సలహాలు అడుగుతామని ఆ కుర్రాళ్లు అంటున్నారు. సెప్టెంబర్‌19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ 2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన తర్వాత యువరాజ్‌ సింగ్‌ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ పనులు చూసుకుంటున్నాడు. సరదా కోసం విదేశీ పొట్టి క్రికెట్‌ లీగులు ఆడుతున్నాడు.