అమిత్ షాకు మళ్లీ అనారోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక !

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఆగస్టు 2న అమిత్ షాకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ఆ కొద్దిరోజులకే అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యతో మరోసారి ఎయిమ్స్ లో చేరారు.

కోలుకొని గత వారమే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి సేమ్ అదే సమస్యతో అమిత్ షా ఎయిమ్స్ లో చేరినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తనకు ఆయాసం వస్తోందని, అలసటగానూ, ఒళ్లు నొప్పులుగానూ ఉన్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.సోమవారం నుండి పార్లమెంట్ మొదలు కానుంది. మరీ అమిత్ షా కోలుకొని పార్లమెంట్ సమావేశాలకి హాజరవుతారా ? అన్నది చూడాలి.