లైంగిక వేధింపుల కేసు : అనురాగ్ కశ్యప్’కు నోటీసులు 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు స‌మ‌న్లు పంపారు. త‌న‌ను డైరెక్ట‌ర్ క‌శ్య‌ప్ లైంగికంగా వేధించార‌ని బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘాష్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆరోపణలు మాత్రమే కాదు.. అనురాగ్ పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ పై  ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 కింద కేసు న‌మోదు చేశారు.

తాజాగా అనురాగ్ కి నోటీసులు పంపారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ నిమిత్తం పోలీస్‌స్టేష‌న్‌కు రావాల‌ని ఆ స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో త‌న‌పై  కశ్యప్ అత్యాచారం చేశారని పాయ‌ల్ తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. అంతేకాదు.. అనురాగ్ కశ్యప్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ ని కలిసిన సంగతి తెలిసిందే. తనకి భద్రతని పెంచాలని విజ్ఝప్తి చేసింది.