ఐపీఎల్ : ముంబై హ్యాట్రిక్

ఐపీఎల్ ని నీరసంగా మొదలెట్టి జోష్ గా ముగించడం ముంబై ఇండియన్స్ కి అలవాటే. ఐపీఎల్ 13 తొలి మ్యాచ్ లోనే ముంబై చెన్నై చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తోంది. నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది.

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టును బుమ్రా (4/20) దెబ్బతీశాడు. బట్లర్‌ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) పోరాడాడు. ముంబయి పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయింది. జైశ్వాల్‌, సంజు శాంసన్‌ డకౌటవ్వగా.. స్మిత్‌ ఆరు పరుగులకు ఔటయ్యాడు. ఆఖర్లో ఆర్చర్‌ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించింది. ఈ గెలుపుతో రోహిత్‌సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ సీజన్‌లో ముంబయికి ఇది వరుసగా మూడో విజయం.