బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్ మంజూరు

ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. ఆమెకు ముంబై హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబై విడిచి వెళ్లరాదని, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు.. ప్రతి పదిరోజులకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాలనీ ఆదేశించింది.

రియాకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఆమె సోదరడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన రిమాండ్‌ ను అక్టోబర్‌ 20 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సొదరుడితో పాటు మరికొందరు అరెస్టయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8 నుంచి రియా జైలులోనే ఉన్నారు. తాజాగా ఆమెకి బెయిల్ మంజూరైంది.

ఇక ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ నోటీసులు జారీ చేసి.. విచారించిన సంగతి తెలిసిందే. అయితే వీరికి డ్రగ్స్ కేసుతో సంబంధాల్లేవని తేలినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ చాట్ లో ఉన్నది ప్రత్యేకమైన సిగరేట్స్ కోసమని చెప్పినట్టు తెలిసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన స్నేహితురాలి రియా డ్రగ్స్ ని తన ఇంట్లో దాచిపెట్టినట్టు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.