ఐపీఎల్ : దూకుడు కరువైన చెన్నై.. మరో ఓటమి !

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయవంతమైన జట్టు. ఆ జట్టు మూడు టైటిల్స్ ని గెలిచింది. అత్యధిక సార్లు ఫైనల్ ఆడిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. అలాంటి చెన్నై జట్టు ఈ సీజన్ లో పడుతూ లేస్తూ.. ముందుకు కదులుతోంది. బుధవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) విజృంభించడంతో 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ధోనీసేన విఫలమైంది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (50; 40 బంతుల్లో 6×4, 1×6), అంబటి రాయుడు (30; 27 బంతుల్లో 3×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. ఆఖరులో చెన్నై చేతిలో వికెట్లు ఉన్నా..  రన్ రేటు పెరిగిపోవడంతో చేధించలేకపోయింది. అంటే.. చెన్నై జట్టులో మునుపటి దూకుడు కరువైంది. క్రీజులో జయదేవ్, జడేజా లాంటి హిట్టర్లు ఉన్నా.. ఏం చేయలేకపోయారు.