కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్‌ కేంద్రాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల తోపాటు మున్సిపాలిటీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటు వేయనున్నారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి తెలిపారు. బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి, భాజపా నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.