రికార్డ్ : ధోని @300 సిక్సర్స్ 

చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఖాతాలో సిక్సర్ల రికార్డ్ వచ్చి చేరింది. శనివారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 16వ ఓవర్‌ మూడో బంతిని ధోనీ లాంగ్‌ఆన్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. ఆ సిక్సర్‌తో మహీ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు.

అత్యధిక సిక్సర్స్ బాదిన ఆటగాళ్లలో ధోనీ కంటే ముందు మంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ(375), చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా (311) ఉన్నారు. అయితే, బీసీసీఐ నిర్వహించే టీ20 లీగ్‌లోనే ధోని 214 సిక్సర్లు బాదాడు. భారత జట్టు తరఫున కేవలం 52 మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మొత్తంగా 323 టీ20లు ఆడిన ధోనీ 40.01సగటుతో 6,723 పరుగులు చేశాడు. 27 అర్ధశతకాలున్నాయి. స్ట్రైక్‌రేట్‌ 135.1. అయితే.. టీ20ల్లో అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. 978మ్యాచ్‌లాడిన గేల్‌ 404 సిక్సర్లు బాదాడు.