టాలీవుడ్ దీపావళి ఆశలు కూడా నీరుగారినట్టే !

కరోనా లాక్‌డౌన్ తో ఆర్నేళ్ల పాటు సినిమా షూటింగ్స్ ల్లేవ్. థియేటర్స్ బంద్. అన్ లాక్ 5లో భాగంగా కేంద్రం థియేటర్స్ కు అనుమతులిచ్చింది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుపుకోమని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏపీ మాత్రమే థియేటర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్స్ తెరచుకోలేదు. దీంతో దసరా సీజన్ పోయింది. దీపావళీ కూడా అంతేనని తెలుస్తోంది.

మరో నెల అంటే నవంబర్ చివరి వరకు ఇప్పుడు అమలులో వున్న కోవిడ్ నిబంధనలే కొనసాగుతాయని క్లారిటీ వచ్చేసింది.ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేసినా, సినిమాలు లేవు, కలెక్షన్లు లేవు.  అందువల్ల యాభై శాతం ఆక్యుపెన్సీ అన్నది ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు. దీపావళి అయిపోతుంది. ఇక మిగిలింది క్రిస్మస్ సీజన్ మాత్రమే.

డిసెంబర్ లో కనుక టోటల్ ఆక్యుపెన్సీకి అనుమతి వస్తే అప్పుడు కొత్త సినిమాలు రావడానికి అవకాశం వుంది. లేదూ అంటే ఇక సంక్రాంతి కోసం ఆశగా చూడాల్సిందే. సంక్రాంతికి మాత్రం దాదాపు డజన్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.  రెడ్, క్రాక్, రంగ్ దే, బ్యాచులర్, వకీల్ సాబ్, ఉప్పెన, ఇంకా చాలా సినిమాలు లైన్ లో వున్నాయి.