గవర్నర్’ని కలిసిన నిమ్మగడ్డ

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఎస్ఈసీ ‌నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించనున్నట్టు సమాచారం.

గవర్నర్‌తో భేటీ తర్వాత జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకున్నా.. ఎస్ ఈసీ ముందడు వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.