కరోనాతో అహ్మద్‌ పటేల్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌(71) కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా సోకింది. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అహ్మద్‌ పటేల్‌ 1949, ఆగస్టు 21న గుజరాత్‌లోని భరూచ్‌లో జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యూత్‌ కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1976లో తొలిసారి భరూచ్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ భరూచ్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా బరిలోకి దింపారు.

అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌లో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్నారు. ఎనిమిది సార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1985లో రాజీవ్‌గాంధీకి పార్లమెంటు కార్యదర్శిగా వ్యవహరించారు.