తెలంగాణలోనూ రైతు ఉద్యమం

కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలోకి దూసుకొచ్చారు. ఆందోళన చేస్తున్నారు. వారితో చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. ప్రస్తుతం రెండో విడత చర్చలు జరుపుతోంది. మరోవైపు రైతు ఉద్యమం అన్నీ రాష్ట్రాలకి పాకుతోంది. తాజాగా తెలంగాణలోనూ రైతులు ఆందోళన బాటపట్టారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.దిల్లీలో రైతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపు మేరకు హైదరాబాద్-గోల్కొండ క్రాస్‌రోడ్డు వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ద్రం స్పందించి మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు సవరించుకోకపోతే ఈ నెల 5న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతుల సంఘాలు హెచ్చరించాయి.

మరోవైపు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్రానికి అల్టీమేటం జారీ చేశారు. నూతన చట్టాలతో పాటు, విద్యుత్‌ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యంతరాలను అన్నదాతలు లిఖితపూర్వకంగా కేంద్రానికి సమర్పించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గణతంత్రదినోత్సవం పరేడ్‌లో ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.