రజనీకాంత్ సినిమా యూనిట్’లో 8మందికి కరోనా.. షూటింగ్ కి బ్రేక్ !

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తె’. కొన్నాళ్లుగా హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడీ సినిమా షూటింగ్ కి సడెన్ బ్రేక్ పడింది. చిత్రబృందంలోని 8 మందికి కరోనా పాజిటివ్ గా తేలడమే ఇందుకు కారణం. వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేవట. కానీ పాజిటివ్ గా తేలింది. దీంతో షూటింగ్ ని క్యాన్సిల్ చేసేశారు. రజనీతో పాటు చిత్రబృందం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిపోయింది.

ఈ ఎఫెక్ట్ రజనీ పొలిటికల్ ఎంట్రీపై పడనుంది. ఈ నెల 31న రజనీ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. ఈలోగా అన్నాత్తె సినిమాని షూటింగ్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకే ప్రతిరోజు 14 గంటల పాటు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ కరోనా రజనీకి షాక్ ఇచ్చింది. ఇక రజనీ కూడా 15 రోజుల పాటు హోంక్వారంటైన్ లోకి వెళ్లనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. పొలిటికల్ ప్రకటన ఉంటుందా ? వాయిదా పడుతుందా ?? అన్నది రజనీ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.