రూ. 2.5కోట్లు పలికిన సర్పంచ్ పదవి

గణేష్ లడ్డూ వేలం చూశాం. ఆస్తుల వేలం చూశాం. కానీ సర్పంచ్ పదవి వేలం. దానికి రూ. 2.5కోట్లు పలకడం ఎక్కడైనా చూశామా ? తాజాగా సర్పంచ్ పదవి కోసం ఒకరు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఉమ్రానె గ్రామంలో జరిగిందీ ఘటన.  గ్రామస్థులు అనధికారికంగా ఈ వేలం నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.5 కోట్లు వెచ్చించి విశ్వాస్‌ రావ్‌ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నారు.

ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన వేలం రూ. కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే వేలం నిర్వహించారు. దేవరాను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారట. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రకమైన ఏకగ్రీవాలు జరిగాయి. కానీ ఇంత మొత్తానికి జరగలేదని చెబుతున్నారు.