ఏపీ హైకోర్టు సీజే అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సిక్కిం హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న గోస్వామిని..ఏపీకు బదిలీ చేయగా..ఏపీ ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జస్టిస్‌ అరూప్‌ గోస్వామి జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా తీసుకున్నారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేయించుకున్నారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

2011 నుంచి 2013 వరకు నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సేవలు అందించారు. 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఏపీకి బదిలీపై వచ్చారు.