మరిన్ని చైనా యాప్‌లపై నిషేధం

పోతూ పోతూ పగ తీర్చుకుంటున్నారు అమెరికార్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు. చైనా బిలియనీర్‌ జాక్‌ మా కు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్‌ గ్రూప్‌నకు చెందిన వీచాట్‌పే లావాదేవీ యాప్‌లు సహా మొత్తం ఎనిమిదింటి కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుంది.

గతంలోనూ ట్రంప్‌ ఓసారి వీచాట్‌పేను నిషేధించారు. అప్పట్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు యాపిల్‌, ఫోర్డ్‌ మోటార్‌, వాల్‌మార్ట్‌, వాల్ట్‌ డిస్నీ ట్రంప్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. చైనాలో వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు ఎంతో కీలకమని తెలిపారు. దీన్ని కోర్టులో సవాల్‌ చేయగా.. ట్రంప్‌ నిర్ణయాన్ని ధర్మాసనం కొట్టివేసింది. తాజా నిషేధాన్ని కూడా అమెరికా వ్యాపార సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉందని సమాచారం. క్యామ్‌స్కానర్‌, షేర్‌ఇట్‌, వీమేట్‌, డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్ నిషేధిత జాబితాలో ఉన్నాయి. మరోవైపు భారత్ కూడా చైనాకు చెందిన 60 యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.