వైరల్ : జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి

సిడ్నీలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టాడు.ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ప్రారంభం సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమి తొలి టెస్టులో గాయపడగా సిరాజ్‌ రెండో టెస్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. సిరాజ్‌ కంటతడి పెట్టడం ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇక మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌, ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను ఔట్‌ చేశాడు. నాలుగో ఓవర్‌లో ఓ చక్కటి బంతిని వేసి బోల్తా కొట్టించాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా ఊరించే బంతి వేయడంతో వార్నర్‌ స్లిప్‌లో పుజారా చేతికి చిక్కాడు. దీంతో మూడో టెస్టులోనూ సిరాజ్‌ కీలకంగా మారాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి 58 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది.