ఉద్యోగులకు కేసీఆర్‌ మరో తీపికబురు

సీఎం కేసీఆర్ పాలనపై రైతులు, వృద్దులు, కార్మికులు.. సంతృప్తిగానే ఉన్నారు. కానీ యువత మాత్రం అసంతృప్తితో ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరిని ఒకేసారి ఖుషి చేయబోతున్నారు సీఎం కేసీఆర్. న్యూ ఇయర్ కానుకగా ఉద్యోగులకి ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా ఉద్యోగులకు కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు.

పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు… ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు.