సైనాకు రెండోసారి కరోనా

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్ ‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొన్నారు. బ్యాంకాక్‌లో ఉన్న సైనాకు సోమవారం మూడోసారి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెతోపాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కి కూడా కరోనా సోకింది. దీంతో వీరిద్దరినీ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిర్వాహకులు సూచించారు.

కొన్ని వారాల క్రితమే సైనా కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. సైనాతో పాటు ఆమె భర్త కశ్యప్‌కు కూడా కరోనా సోకగా.. వీరిద్దరూ కొన్ని రోజులు ప్రాక్టీస్‌కు దూరమయ్యారు. డిసెంబర్‌ 27న వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కశ్యప్‌ తెలిపారు.కరోనా ఒకే వ్యక్తికి రెండోసారి సోకితే.. తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో సైనా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.