జడేజా స్థానంలో కుల్‌దీప్ ?

బ్రిస్బేన్‌ వేదికగా శుక్రవారం నుంచి టీమిండియా ఆఖరి టెస్టు ఆడనుంది. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో తుదిజట్టుపై ఆసక్తి పెరిగింది. అయితే ప్రాక్టీస్‌ సెషన్ లో కుల్‌దీప్‌యాదవ్ బంతిని గింగరాలు తిప్పుతుండటంతో జడేజా స్థానంలో అతడు స్థానం దక్కించుకుంటాడనిపిస్తోంది. 

నెట్స్‌లో సాధన చేస్తున్న గిల్‌కు కుల్‌దీప్ బౌలింగ్ చేశాడు. స్పిన్‌, వేగంతో దూసుకొచ్చిన బంతుల్ని ఎదుర్కోవడానికి గిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల వేసిన ఓ బంతి గింగరాలు తిరుగుతూ గిల్‌ ప్యాడ్‌కు తగలింది. బ్యాట్స్‌మన్‌కు సమాధానం దొరకని ఆ బంతిని చూసి గిల్‌ ఆశ్చర్యంగా చూశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ‘కుల్‌దీప్‌ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్‌ అంటారా?’ అని దానికి వ్యాఖ్య జత చేసింది. 

ఇక బుమ్రా గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్‌లో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే సిరాజ్‌, సైనితో పాటు శార్దూల్, నట్టూ ఇద్దరికీ అవకాశం వస్తుంది.