ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పై హైకోర్ట్  కీలక ఆదేశాలు

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పై తెలంగాణ హైకోర్టులో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎల్ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.2016లోనే ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు స్వీకరించింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

వీటిపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.