ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది. తొలి దశ ప్రక్రియ ఇలా జరగనుంది.
* జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ

* 25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ

* 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు

* 28: నామినేషన్ల పరిశీలన

* 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

* 30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

* 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

* ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

* పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి.. ఉపసర్పంచి ఎన్నిక జరగనుంది.