మళ్లీ తెరపైకి.. శ్యామ్ సహజీవనం కేసు !

కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు సహజీవనం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. శ్యామ్‌ కె.నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు బెదిరించారని, తనకు ప్రాణహాని ఉందని శుక్రవారం ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్‌ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేశారని, శ్యామ్‌ కె.నాయుడిని ఇంత వరకు అరెస్టు చేయలేదని రెండోసారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసుని ఆమె ఉపసంహరించుకున్నారు. అయితే తాజాగా తనని బెదిరించిన కారణంగా అప్పుడు కేసు విత్ డ్రా చేసుకున్నా.. శ్యామ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకి ఫిర్యాదు చేసింది.