పవన్, మహేష్.. ఒకేరోజు మొదలెట్టారు !

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఒకేరోజు సెట్స్ మీదకు వెళ్లారు. వీరిద్దరి చిత్రాల షూటింగ్స్ ఈరోజు మొదలయ్యాయ్. పవన్‌కల్యాణ్‌-రానా ప్రధాన త్రల్లో మలయాళీ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఉదయం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. పవన్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోవైపు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ షూటింగ్ ఈ ఉదయం దుబాయ్‌లో ప్రారంభమైంది. షూట్‌ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా ఓ ప్రత్యేక వీడియోని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.