బన్నీ కోసం.. చీకటిని సైతం లెక్కచేయలేదుగా !

గతేడాది ‘అల.. వైకుంఠపురములో..’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న స్టయిలీష్ స్టార్ అల్లుఅర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలో ఇటీవల లొకేషన్‌కు వెళ్తున్న బన్నీ కారును ఆపిన కొంతమంది గిరిజనులు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన షూట్‌ కోసం తూర్పుగోదావరిలోని రంపచోడవరం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బన్నీని కలిశారు. చిమ్మచీకట్లను సైతం లెక్కచేయకుండా తనని చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి ఆనందించిన బన్నీ వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.