నటి రాధిక పొలిటికల్ ఎంట్రీ ఖరారు

త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సినీ గ్లామర్‌ను సంతరించుకోనున్నాయి.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాధికా శరత్ కుమార్ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త శరత్‌కుమార్ ప్రకటించారు.

శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా రాధిక వ్యవహరిస్తున్నారు. 2011 నుంచి ఎస్‌ఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసే పోటీకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు.

అయితే.. ఈసారి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఆశిస్తున్నామని, ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామని శరత్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా శరత్‌కుమార్ పార్టీ పోటీ చేసింది. ఆ సమయంలో.. తెంకాసి నియోజకవర్గం నుంచి శరత్‌కుమార్, నంగునేరి స్థానం నుంచి ఎ.నారాయణన్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో భార్య రాధికని బరిలోకి దించడానికి శరత్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు.