షాకింగ్ న్యూస్ : మార్చి1 నుంచి థియేటర్స్ మూసేవేత

కరోనా లాక్ డౌన్ తో దాదాపు 9 నెలల పాటు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులకి వినోదం కరువైంది. ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. అయితే ఇటీవలే థియేటర్స్ తిరిగి తెరచుకున్నాయ్. మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరవడానికి అనుమతులు ఇచ్చిన కేంద్రం.. ఇటీవల వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు మంజూరు చేసింది. ప్రేక్షకుల్లో కూడా కరోనా భయం పోయి.. మునుపటిలా థియేటర్స్ కి వెళ్తున్నారు. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్ లో ఎగ్జిబ్యూటర్స్ షాక్ ఇచ్చారు. మార్చి1 నుంచి థియేటర్స్ మూసేస్తామని తెలిపారు.

బుధవారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మ‌ధ్య మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ప‌లు డిమాండ్స్ నిర్మాతల ముందుంచారు. వీటిని ఒప్పుకోని ప‌క్షంలో మార్చి  1 నుండి థియేట‌ర్స్ మూత‌బ‌డ‌తాయి అని స్ప‌ష్టం చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం త‌ప్ప‌క అమ‌లుప‌ర‌చాల‌ని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఓటీటీ రిలీజ్ విషయంలో కండిషన్స్ పెట్టాలని కోరుతున్నారు. థియేట‌ర్స్‌లో విడుద‌లైన 6 వారాల త‌ర్వాత పెద్ద సినిమాలు, 4 వారాల త‌ర్వాత చిన్న సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేయాలని కోరుతున్నారు.

నిన్న జరిగిన సమావేశంలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, ఆసియన్ సునీల్, మైత్రీ మూవీస్ నిర్మాతలు, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వీరు ఎగ్జిబిట‌ర్స్ కండీష‌న్స్‌కు క‌ట్టుబ‌డి ఉంటే సినిమాలు య‌ధావిదిగా థియేట‌ర్‌లో నడుస్తాయి. లేదంటే.. మార్చి1 నుంచి మూతపడనున్నాయ్. మరీ.. బడా నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.