‘సలార్’ తొలి షెడ్యూల్ పూర్తి


కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సలార్’. శృతిహాసన్ కథానాయిక. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రత్యేక గీతంలో మెరవనుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్‌ పూర్తయినట్లు సినిమాటోగ్రాఫర్‌ భువన్‌గౌడ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా కెమెరాను సెట్‌ చేస్తున్న ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాన్ని ఉంచి ‘శిఖరాన్ని అధిరోహిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు.

మొదటి షెడ్యూల్లో తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల్లో కొన్ని యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించగా, హీరోయిన్ శృతిహాసన్‌ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. షూట్‌కు సంబంధించి లీకైన ప్రభాస్‌ చిత్రాలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు రాధేశ్యామ్ తో పాటు ఆదిపురుష్ సినిమాలని పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నారు.