ఉప్పెన.. ఆఖరి పంచ్ పవన్’దే !


‘ఆఖరి పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరబ్బా’. ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ని ఉప్పెన టీమ్ కరెక్ట్ గా వాడుకుంది అంటున్నారు. అదెలా అంటే.. ? ‘ఉప్పెన’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఓకే చేసిన కథ ఇది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. దర్శకత్వం శిష్యుడిదే అయినా.. సుకుమార్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు.

ఉప్పెన పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా అన్నింటికి అద్భమైన స్పందన వచ్చింది. అలాగని.. ప్రమోషన్స్ ని లైట్ తీసుకోలేదు చిత్రబృందం. ఇటు సుకుమార్, అటు మెగా ఫ్యామిలీ ప్రమోషన్స్ ని ఉప్పెనలా చేశారు. రామ్ చరణ్, ఎన్ టీఆర్ లు ఉప్పెనని ప్రమోట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేశారు. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లారు. అయినా ఉప్పెన చిత్రబృందం సంతృప్తి చెందలేదు.

రేపు (ఫిబ్రవరి 12) సినిమా రిలీజ్ కానుండగా..  ఆఖరి అస్త్రంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని రంగంలోకి దించారు. పవన్ ని కలిసి ఉప్పెన టీమ్ ఫోటోని మైత్రీ మూవీస్ ట్విట్ చేసింది. ‘మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు’ అని పవన్ చెప్పారని కామెంట్ పెట్టింది. దీంతో ఉప్పెన ప్రమోషన్స్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆఖరి పంచ్ ఇచ్చినట్టయింది. పవన్ పంచ్ ఇచ్చాక.. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.