పెట్రోల్, డిజీల్ ధరలని తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

పెట్రో ధరలు తగ్గాయ్. అవునూ.. ఇండియాలోనే పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గాయ్. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 5 రూపాయల మేర తగ్గిస్తూ అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మద్యంపై 25 శాతం సుంకాన్ని తగ్గించింది.

కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మ శుక్రవారం అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ‘కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పెట్రోల్‌, డీజిల్, మద్యంపై అదనపు సెస్‌ విధించాం. ఇప్పుడు కొవిడ్‌ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పెట్రోల్, డీజిల్‌పై ఐదు రూపాయల మేర, మద్యంపై 25 శాతం పన్ను తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది’ అని మంత్రి తెలిపారు.