TRS పేరు మార్చిన రేవంత్ రెడ్డి

‘టీఆర్ఎస్ – తెలంగాణ రాష్ట్ర సమితి’ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ. అందుకోసం కొట్లాడి పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. అందుకే గులాభి పార్టీకి ఒకటికి రెండు సార్లు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అలాంటి గులాభి పార్టీ కోట గోడలు ఇప్పుడిప్పుడే బీటలు పారడం మొదలైనట్టు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే విషయం స్పష్టం అయింది.

ఈ నేపథ్యంలో భాజాపా, కాంగ్రెస్ పార్టీలు తెరాసపై యుద్ధం ప్రకటించాయి. తెరాసకు ప్రత్యామ్నాయం తామే. రేపు అధికారంలోకి వచ్చేది తామేననినిరూపించుకునే పనిలో ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు అనంతరం తెలంగాణ భాజాపాలో నూతనోత్సాహం వచ్చింది. ఆ ఊపుతోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ దూసుకెళ్తోంది. 

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కు మళ్లీ ఊపును తీసుకొచ్చే పనిలో ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇటీవల పాదయాత్ర చేశారు. ప్రస్తుతం ఆయన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తెరాస, భాజాపాలపై విరుచుకు పడ్డారు. ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఐటీఐఆర్‌కు నాడు కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందన్నారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అని ఎద్దేవా చేశారు.ఐటీఐఆర్‌కు సమానమైన ప్యాకేజీ .. మంత్రి కేటీఆర్ ఇవ్వాలనడం దారుణమన్నారు. కమిషన్లు వచ్చేడుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని తెలిపారు. కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పుకొచ్చారు.