నాగ్ ప్రమోషన్ ప్లాన్ అదిరింది

కింగ్ నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు దాడులను ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులని తెలివిగా వాడుకుంటున్నారు నాగ్.


ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ ట్రైలర్ ని చిరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాగ్ సినిమా మెగా అభిమానులకు చేరువైంది. ఇది తమ సొంత సినిమాలా వారు చూస్తున్నారు. ఇక వైల్డ్ డాగ్ ట్రైలర్ ని ముందు చూసింది మెగాస్టార్ చిరంజీవి అయితే.. ఆ తర్వాత చూసి మహేష్ బాబు. 

ట్రైలర్ చూశాక ‘బాగుంది సర్’ అంటూ మహేష్ నాగ్ కి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగ్. దీంతో మహేష్ బాబు అభిమానులు ఖుషి అయ్యారు. వారు కూడా వైల్డ్ డాగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబాయ్ నాగ్ సినిమా బాగా ఆడాలని యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ఎప్పుడూ కోరుకుంటుంటారు. దీంతో.. నాగ్ సినిమాకు తారక్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

మొత్తానికి.. నాగ్ సొంత ఇమేజ్ మాత్రమే నమ్ముకోకుండా.. మిగితా స్టార్స్ అభిమానులకి తన సినిమాని దగ్గర చేస్తున్నారు. వారిని తన సినిమా చూసేందుకు థియేటర్స్ లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అది వర్కవుట్ అయితే వైల్డ్ డాగ్ ఓపెనింగ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి.. నాగ్ ప్రమోషన్స్ ప్లాన్ అదిరిందని చెప్పవచ్చు.