నోముల మృతి తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నర్సింహయ్య నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

“1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో నోముల నర్సింహయ్య జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పేదల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నోముల అనేక పోరాటాలు చేశారు. తన ఆశయాలకు అనుగుణంగా నోముల సీపీఎంలో చేరారు. నకిరేకల్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించారు.

సీపీఎం శాసనసభాపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. నేటితరం నాయకులు నోముల నర్సింహయ్యను చూసి నేర్చుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ప్రయోజనాల కోసం నోముల పోరాడారు. నాగార్జున సాగర్‌ ఎడమకాల్వ రైతుల ప్రయోజనాల కోసం పోరాడారు. నకిరేకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నోముల పాటుపడ్డారు. తెరాసతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని నర్సింహయ్య విశ్వసించారు. 2018లో సాగర్‌ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేశారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం చివరి వరకు కృషి చేశారు. నోముల మృతి తెలంగాణకు, తెరాసకు తీరని లోటు” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.