పంత్’పై అశ్విన్ ఆరోపణలు

డీఆర్‌ఎస్ – అంటే ధోని రివ్యూ సిస్టమ్ గా మారిపోయింది. డీఆర్‌ఎస్ అంతా పక్కగా వాడుకున్నాడు ధోని. వికెట్ల వెనకాల ఉండి బంతి సరిగ్గా అంచనా వేసేవాడు. అయితే ప్రస్తుతం యువ వికెట్ కీపర్ పంత్ మాత్రం డీఆర్ఎస్ లు వృథా చేస్తున్నారు. దీనిపై స్పిన్నర్ అశ్విన్ స్పందించారు. పంత్‌ వల్లే అంపైర్‌ నిర్ణయ సమీక్ష (డీఆర్‌ఎస్‌)లు వృథా అవుతున్నాయని అశ్విన్‌ అంటున్నారు. సమీక్షలు కోరే విషయంలో పంత్ మరింత మెరుగవ్వాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

“సమీక్షల విషయంలో నన్ను చూసే దృష్టికోణం మారాలి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు నా సమీక్షలు బాగుండేవి. అయితే సమీక్ష కోరేటప్పుడు వికెట్‌ కీపర్‌ మీద ఆధారపడాల్సి ఉంటుంది. బంతి సరైన లైన్‌లో పడిందా? వికెట్లను తాకుతుందా? బౌలింగ్‌ కోణం, బౌన్స్‌ ఎలా ఉంది? అనే విషయాల్లో కీపర్‌ సాయం అవసరం. కాని చాలా సందర్భాల్లో పంత్‌ నన్ను నిరాశ పరిచాడు. దీంతో పంత్‌ను పక్కకు తీసుకెళ్లా. ఈ విషయంలో మనం కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పా. ఎందుకంటే సమీక్ష కోరే విషయంలో రవిశాస్త్రికి నా మీద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి” అని అశ్విన్ చెప్పుకొచ్చారు.