ఈటెలని స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లిన కేటీఆర్

సీఎం కేసీఆర్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ కు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అప్పట్లో ఈటెలని మంత్రి పదవి నుంచి మధ్యంతరంగా తొలగిస్తారనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ నేపథ్యంలో గులాభి జెండాకి అసలైన ఓనర్లం మేమే అంటూ ఈటెల గర్జించారు. అప్పటి నుంచి ఈటెలతో సీఎం కేసీఆర్ కు గ్యాప్ కొనసాగుతూనే వస్తోంది. అది ఎక్కడికి వరకు వచ్చిందంటే.. ఈటెల కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేసే వరకు వెళ్లింది. 

కొన్నాళ్ల క్రితం నిరసనగళం వినిపించిన ఈటెల ఆదివారం మరోసారి నిరసన గళం వినిపించారు. కల్యాణ లక్ష్మీ, షాద్ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు.. లాంటి సంక్షేమ పథకాలు పేదవాడి ఆకలిని తీర్చవు. పేదల అభివృద్దికి దోహదపడే కార్యక్రమాలని చేపట్టాలన్నారు. అంతేకాదు.. డబ్బు, పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి అన్నారు. 

ఈ నేపథ్యంలో తెరాసలో ఈటెల ఇమడలేకపోతున్నారు. అందుకే ఆయన పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. త్వరలోనే ఈటెల కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈటెలని మంత్రి కేటీఆర్ తన కారులో ఎక్కించుకొని ప్రగతి భవన్ కి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ తో ఈటెలని సమావేశపరిచారు. ఈ సందర్భంగా నిరసన గళంపై ఈటెలని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మనసులో ఏం పెట్టుకోవద్దు. పార్టీ ఎవరిని గాయపరచదని ఈటెలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీతో సీఎం కేసీఆర్ తో ఈటెలకు నెలకొన్న గ్యాప్ తొలగిపోయినట్టేనని తెరాస శ్రేణులు చెబుతున్నాయి.