తెలంగాణలో 53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులు రద్దు

తెలంగాణ హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులని రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులు రద్దు కానున్నాయి. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరు కావడంతో.. ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 


అయితే ఈ ప్రత్యేక కోర్టుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవలను ఇతర న్యాయస్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్లలోపు శిక్ష ఉండే కేసులు, చెక్ బౌన్స్ వివాదాలను పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం ప్రత్యేక మేజిస్టేట్ కోర్టులు ఏర్పాటయ్యాయి. విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వంలో ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు.. వీటిని హైకోర్ట్ రద్దు చేసింది.