రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్

తెలంగాణలో కరోనా వాక్సీన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతిరోజు లక్ష మందికి కరోనా వాక్సిన్ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్‌ని వేగవంతం చేయాలని కేంద్రం సూచించిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిరోజు లక్ష మందికి వాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు.


అంతేకాదు.. రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడినవారు సుమారు 80లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు.  ఈ విభాగంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌, ఆరోగ్య సమస్యలున్న వారితో సహా 10లక్షల మందికి తొలి డోస్ ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.