క్లారిటీ కోరుకుంటున్న టాలీవుడ్

అవునూ.. టాలీవుడ్ క్లారిటీ కోరుకుంటోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ ని కలవానుకుంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే. దాంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా ఉదృతి తీవ్రంగానే ఉంది. ఇక్కడ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు 2వేలకు చేరువవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. థియేటర్స్, బార్లు, క్లబ్ లు.. తదితర వాటిపై ఆంక్షలు విధించనుంది అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి థియేటర్స్ మూసేవేయనుకున్నా.. మునపటిలా 50 శాతం ఆక్యుపెన్సీ అనే ఆంక్ష పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ క్లారిటీ కోరుకుంటోంది.

అందుకే టాలీవుడ్ పెద్దలు కొందరు నేరుగా సిఎమ్ కేసిఆర్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చే క్లారిటీ బట్టి ఈ నెల 16 నుంచి విడుదలయ్యే సినిమాల భవితవ్యం ఆధారపడి వుంటుంది. ఈ వీకెండ్ లోపల అయితే ఎలాంటి నిర్ణయం వుండకపోవచ్చు. ఉగాది తరువాత నుంచి మాత్రం థియేటర్స్, బార్లు.. తదితర వాటిపై ఆంక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. దీనిపై ఓ క్లారిటీ వస్తే.. సినిమాల రిలీజ్ వాయిదాపై ఓ నిర్ణయానికి రావొచ్చని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.