ప్రేక్షకులకు కరోనా జాగ్రత్తలు చెప్పిన పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రేక్షకులకి కరోనా జాగ్రత్తలు చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వకీల్ సాబ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో థియేటర్స్ కళకళాడుతున్నాయ్. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్, అంజలి, అనన్య శనివారం హైదరాబాద్ లో ఓ థియేటర్‌లో సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. 

అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ”ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తున్నామని పవన్‌కల్యాణ్‌ గారికి చెప్పాం. దాంతో మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేయమని ఆయన తెలిపారు. ‘బయట పరిస్థితులు అస్సలు బాలేదు.. కాబట్టి దయచేసి సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్‌లతో రండి. అలాగే సినిమా చూస్తున్న సమయంలోనూ మాస్క్‌ని తీయకండి. జాగ్రత్తగా ఉండండి’ అని పవన్‌ మీకు ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు” అని దిల్‌రాజు వివరించారు.