థియేటర్స్ లో హిట్.. ఓటీటీలో ప్లాప్ !

ఈ మధ్య బాగా పేలిన సినిమా పేరు జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రమిది. ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌. మార్చి 11న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో, యుఎస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ. 4కోట్లతో తీసిన ఈ సినిమా రూ. 40కోట్లు తీసుకొచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే ఏమో గానీ.. రిలీజ్ తర్వాత మాత్రం ప్రచారాన్ని మోత మ్రోగించారు.


స్టార్ హీరోలు జాతిరత్నాలని మోశారు. నవీన్ పొలిశెట్టి సంచలన నటన.. జాతిరత్నాలు సూపర్ హిట్టు.. అంతకుమించి అని ప్రచారం చేశారు. ఇంతటి హైప్ మధ్య ఇటీవలే జాతిరత్నాలు ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన ఓటీటీ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాకా.. ఇంత హడావుడి చేశారు. అసలు సినిమాలో ఏముంది  ?అని ప్రశ్నిస్తున్నారు.అస‌లేమాత్రం లాజిక్ లేని సినిమా. కామెడీ కూడా అంతంత మాత్ర‌మే. దీన్ని ఎలా హిట్ చేశారు.. న‌వ్వుల కోసం అంత క‌రువు వాచిపోయి ఉన్నారా` అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీన్ని బ‌ట్టి.. థియేట‌ర్ ఆడియన్స్ – ఓటీటీ ఆడియన్స్ ఇద్ద‌రూ వేర్వేర‌న్న సంగ‌తి అర్థ‌మైపోతోంది.