ఎన్టీఆర్-విజయ్-అట్లీ.. ఓ మల్టీస్టారర్ !

సినిమా ప్రాంతీయ హద్దులు చెరిగిపోతున్నాయ్. భారతీయ సినిమాగా మారుతున్నాయి. ఇంకా హద్దులు చెరిపేసి.. ప్రపంచ దేశాల్లోనూ భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుకుంటోంది. అన్నీ ప్రాంతీయ బాషల నుంచి పాన్ సినిమాలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్నీ ప్రాంతీయ బాషల్లోని స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల వైపు చూస్తున్నారు. అలాంటి కథలతో వస్తున్న దర్శకులకు ఓకే చెప్పేస్తున్నారు.

బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి పెరిగింది. ప్రభాస్, రానా ఇంటర్నేషనల్ స్టార్స్ గా ఎదిగారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలనే  చేస్తున్నారు. ఆయన దారిలోనే ఎన్ టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పయనించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల కలిసి పాన్ ఇండియా సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే… ? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ రాబోతుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది. 

ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తారక్ ఓకే చెప్పేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయేది తారక్ సినిమానే అని తెలుస్తోంది. తారక్-విజయ్ మల్టీస్టారర్ సినిమా నిజమే అయితే.. కొరటాల సినిమా తర్వాత ఈ సినిమా ఉండవచ్చని చెబుతున్నారు.