అలర్ట్ : బ్యాంక్ పనివేళల్లో స్వల్ప మార్పులు

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బ్యాంకుల పనివేళల్లో స్వల్ప మార్పులు చేయనున్నారు. 

బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్‌ఎల్‌బీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మే 15 వరకూ బ్యాంకుల పనివేళలు తగ్గించడంతో పాటు, సగం మంది సిబ్బందితోనే నిర్వహించే అంశంపై చర్చించారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవల్ని పరిమితం చేసే దిశగా ప్రతిపాదనలు రూపొందించారు. శుక్రవారం నుంచి పనివేళల మార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

‘జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పని గంటలు కుదించడంతో పాటు, తప్పనిసరి సేవలకు మాత్రమే వినియోగదారులు బ్యాంకులకు వచ్చేలా చూడటం, పరిమిత సిబ్బందితో నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలి’ అని బ్యాంకు యూనియన్లు తెలిపాయి.