ఈటెల.. ఇప్పుడు అందరివాడు !

ఈటెల రాజేందర్ చాలా మెతక. ఆయన్ని టీఆర్ఎస్ గెంటేసిన రోషం, పౌరుషం లేదు. ఇంకా సీఎం కేసీఆర్ మా సారు. మా గురువు అంటూ కబర్లు చెబుతున్నారు అంటూ ఆయన అభిమానులు కొందరు పెదవి విరిచారు. కానీ ఈటెల మెతక కాదు. ఆయనకు సౌమ్యం తెలుసు. కత్తిని ఎప్పుడు దూయాలో ఇంకా బాగా తెలుసు. అందుకే ఈటెల వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు అర్థమవుతోంది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఇటీల అందరివాడిలా మారిపోయాడు.

తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్, భాజాపా కీలక నేతలతో ఆయన వరుసగా సమావేశం అవుతున్నారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నట్లు సమాచారమ్. అసలు ఈటెల పోరాటం ఏంటీ అంటే.. ? సీఎం కేసీఆర్. ఆయన ఒంటెద్దు పోకడలు. దానికి చెక్ పెట్టాలంతే.. హుజూరాబాద్ లో ఈటెల రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా గెలవాలి. ఇందుకోసం ఈటెల అన్ని పార్టీల సహకారం కోరుతున్నారు. ఇప్పటికే ఈటెల భట్టీ విక్రమార్కని కలిశారు. కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన మీటింగ్స్ పెట్టారు.

బుధవారం రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌తో ఈటెల భేటీ అయ్యారు. డీఎస్‌ నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై డీఎస్‌తో చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నట్లు ఈటల రాజేందర్‌ వివరించినట్లు సమాచారం. అదే సమయంలో డీఎస్‌ నివాసానికి వచ్చిన ఆయన తనయుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌తో కూడా ఈటల కొద్దిసేపు మాట్లాడారు. మొత్తానికి.. ఇప్పుడు ఈటెల అందరివాడు. ఆయనకు అందరు సహకరించేలా కనిపిస్తున్నారు.