ఆనందయ్య మందుపై ఫైనల్ డిసిషన్ ఎప్పుడంటే ?

ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఔషధంపై పరిశోధన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత తిరిగి పంపిణీని ప్రారంభించనున్నారు. ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. 

ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఔషధ పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుంది. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుంది. సీసీఆర్‌ఏఎస్‌ అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉంది. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం.

కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు విచారణ నివేదికలు సానుకూలంగా వచ్చాయి. టెలిఫోన్‌ విచారణలోనూ చాలా మంది సానుకూలంగానే చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించలేదు. ఔషధంపై ఆనందయ్య ఆయుర్వేద విభాగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రాములు వివరించారు.