అల.. కవర్ చేస్తోన్న కేటీఆర్ !

కరోనా సెకండ్ వేవ్ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయ్. అది నిజం కూడా. హైకోర్టు ఒకటికి రెండు సార్లు చివాట్లు పెట్టి.. డెడ్ లైన్ విధించే వరకు నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్‌ అంతే. పైగా రాజకీయ క్రీడకు తెర లేపింది. ఈటెలపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలపై జెడ్ స్వీడుతో స్పందించింది.

మొత్తంగా కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సామాన్యుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఐతే ఆ తప్పు మాది కాదు.. కేంద్రానిది అన్నట్టుగా మెల్లగా అటు వైపు డైవర్ట్ చేసే పని పెట్టుకున్నారు తెరాస కీలక నేతలు ఇందులో భాగంగానే కరోనా కట్టడికి వాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని మంత్రి కేటీఆర్ చెప్పడం మొదలెట్టారు. అది నిజమే. కానీ ఆ వాక్సిన్ ని కేంద్రం ఇవ్వడం లేదని బదనాం చేస్తున్నారు. ఇందులోనూ నిజం లేకపోలేదు. కానీ అంతకంటే ముందు నైట్ కర్ఫ్యూ. లాక్‌డౌన్‌ విషయంలో ఇంకా త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. పరిస్థితి ఇంకా బెటర్ గా ఉండేది కదా.. అంటున్నారు జనాలు.

శుక్రవారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్‌లో వంద పడకల ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ మాత్రమే. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌లోనే తయారవుతున్నా మన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకోవడం దురదృష్టకరం. కేవలం 15 శాతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రైవేటు ఆస్పత్రులు కొనుక్కోవాలని కేంద్రంనిబంధన పెట్టింది. అందువలనే తాము తెలంగాణ ప్రజలకు వాక్సిన్ ని ఇవ్వలేకపోయామని అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి.. అల.. కరోనా కట్టడి ఫెల్యూర్ ని కేంద్రం ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న మాట.