ఇకపై డిగ్రీలో తెలుగు మాధ్యమం ఉండదు

ఏపీలో కళాశాలలన్నీ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోనున్నాయి.ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం మూతపడనుంది.

గతేడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో 1,336 డిగ్రీ కళాశాలల్లో 2.60 లక్షల మంది చేరారు. వీరిలో 65 వేల మంది తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నారు. వీరిలో బీఎస్సీ కోర్సును ఎంపిక చేసుకున్నవారు అధికం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా తెలుగు మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్లం ఒక్కటే అమలు చేస్తే వీరు తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.