హైపర్ ఆది మెగా డీల్

జబర్థస్త్ నటుడు హైపర్ ఆది ఉచ్చులో చిక్కుకున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌గా, స్క్రిప్ట్ రైట‌ర్‌గా హైప‌ర్ ఆది పాపులారిటీ సంపాదించుకున్నాడు. ద్వంద్వార్థాలు, అశ్లీలం క‌ల‌గ‌లిపి చెప్పే డైలాగ్‌లే కామెడీగా చెలామ‌ణి అవుతున్న ప‌రిస్థితి. అయితే ఈసారి ఆది గట్టిగా చిక్కుకున్నాడు. ఈ నెల 13న ఈటీవీలో ప్ర‌సార‌మైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాస‌ను కించపరిచేలా హైప‌ర్ ఆది మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ తీవ్ర‌ ఆగ్ర‌హంగా ఉంది. ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు చేసింది. 

తెలంగాణ జాగృతికి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట క‌విత నేతృత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంస్థ అనుబంధ విద్యార్థి సంఘం సీరియ‌స్‌గా స్పందించ‌డంతో వ్య‌వ‌హారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వివాదంపై స్పందించిన హైపర్ ఆది.. తాను కేవ‌లం న‌టుడిని మాత్ర‌మే.. స్క్రిప్ట్ తాను రాయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఆ కార్య‌క్ర‌మం జ‌రిగే స‌మ‌యానికి స్టేజి మీద 20 మంది వ‌ర‌కు ఆర్టిస్టులు ఉన్నారు. ఎవ‌రి పాట వారు పాడుకుంటున్నార‌ని తెలిపాడు. ఆ ప్లోలో ఏదైనా మిస్టేక్ జ‌రిగి ఉంటే తెలంగాణ వాళ్ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతాన‌న్నాడు. 

క్ష‌మాప‌ణ‌లు చెప్పినా విడిచి పెట్టే ప్ర‌సక్తే లేద‌ని జాగృతి సంస్థ హెచ్చ‌రించింది. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో ఆది మాట్లాడుతున్నాడ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదిని కాపాడే గలిగేది కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే. మెగాబ్రదర్  నాగబాబుకు ఆది క్లోజ్. పైగా ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని, భక్తుడు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నుంచి ఆదిని గట్టేక్కించేది మెగా ఫ్యామిలీ మాత్రమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయ్.