ఏపీ రాజధాని విశాఖ : క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్

ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు ఏపీ రాజధాని వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షో సందర్భంగా అమరావతి రాజధాని విశాఖ అంటూ యాంకర్ ప్రదీప్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే హైదరాబాద్ లోని ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. సోషల్ మీడియాలోనూ ప్రదీప్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయ్.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ స్పందించారు.  తన సందేశంతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రం, రాజధాని… అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత ప్రదీప్ తెలిపారు.