టీఆర్ఎస్.. మరోసారి రెచ్చగొట్టుడు రాజకీయాలు !

రెచ్చగొట్టుడు రాజకీయాలు చేయడం టీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అవే టీఆర్ఎస్ పెట్టుబడి. ప్రజల్లోనూ అప్పుడు ఆ ఎమోషన్ ఉంది. కాబట్టి వర్కవుట్ అయింది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ రెచ్చగొట్టు రాజకీయాలని కేసీఆర్ ఫాలో అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. కేసీఆర్.. చంద్రబాబుని టార్గెట్ చేశారు. లబ్ధి పొందారు. 2018లో ఆ రెచ్చగొట్టుడు కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి టీఆర్ ఎస్ రెచ్చగొట్టుడు రాజకీయాలకు తెరలేపింది.

ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. నీళ్లు తరలించుకు పోనుంది. దీని వలన తెలంగాణ ఏడారి అవుతుందని గగ్గోలు పెడుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ మంత్రులు, తెరాస కీలక నేతలు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ని తిట్టిపోస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్టాడంలో తప్పులేదు. ఆ హక్కు, బాధ్యత అధికారంలో ఉన్న తెరాస నేతలు ఉంది. 
అయితే ఈ కొట్లాడే విషయంలో ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన రోజే వ్యతిరేకించేవారని ధ్వజమెత్తారు. ఏడాది వరకు ఎందుకు ఆగి మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..రాజకీయ లబ్ధి పొందాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రయోజనాలకంటే, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని 2023 వరకు సాగదీసి.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.