అనుపమకి టీచర్‌ ఉద్యోగం

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టీచర్ ఉద్యోగం రాబోతుంది. పరీక్షకు హాజరుకాకుండానే బిహార్‌ రాష్ట్రం నిర్వహించిన సెకండరీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎస్‌.టి.ఇ.టి)లో అనుపమ పాసైంది. 

బీహార్ విద్యా శాఖ 2019లో నిర్వహించిన ఎస్‌.టి.ఇ.టి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సంబంధిత వెబ్‌సైట్‌లో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగా అందులో నటి అనుపమ ఫొటో తన కంటపడింది. వ్యక్తిగత వివరాలన్నీ తనవే ఉన్నా ఫొటో మాత్రం అనుపమది ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దాంతో ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రిషికేశ్‌. ఇప్పుడీ స్కోర్‌ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ టీచరమ్మ కాబోతుందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇలాంటి పరిణామాలు బిహార్‌కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు తప్పిదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వెలువడిన జూనియర్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఫలితాల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ 98.5 మార్కులు తెచ్చుకుని, టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.